Monday 29 February 2016

March Updates

31-Mar-2016
--------------------



23-Mar-2016
--------------------

22-Mar-2016
--------------------
కరవు కాలుమోపలేని ఇజ్రాయిల్‌..! 
15 ఏళ్ల దుర్భిక్షాన్ని సవాలు చేసిన చిరుదేశం 
ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేక కథనం: దాదాపు 14ఏళ్ల పాటు తీవ్రమైన కరవు.. ఓ వైపు మధ్యదరా సముద్రం ఉన్నా తాగటానికి.. వాడకానికి పనికిరాని ఉప్పునీరు.. ఒక రకంగా దీనికి ఎదురునిలవడం అంటే ప్రకృతిపై పోరాడి గెలవడమే.. ఆ పనే చేసింది ఇజ్రాయిల్‌..!
ఆకాశం నుంచి రాలే ప్రతిబొట్టును ఒడిసి పట్టింది.. వినియోగించిన నీటిని సాధ్యమైనంత వరకు రీసైక్లింగ్‌ చేసింది.. సముద్రపు నీటిని శుద్ధి చేసింది.. అన్నిటినీ మించి నీటి పొదుపుపై పెద్దఎత్తున అవగాహన కల్పించింది. దీంతో ఇజ్రాయిల్‌ కరవు ప్రభావం చూపని దేశంగా గర్వంగా నిలిచింది.
నాసా అధ్యయనాల ప్రకారం 1998-2012 వరకు మధ్యదరా సముద్రం తూర్పుప్రాంతంలో 900 ఏళ్లలో ఎన్నడూ లేనంత భయంకరమైన కరవు తాండవించింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దేశంలో సగం నీరు స్వయంగా తయారు చేసినదే కావడం గమనార్హం. ఫలితంగా అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన 2015 సంవత్సరలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడింది.
2007-08 శీతాకాలంలో వర్షపాతం పూర్తిగా కుంటుపడింది. దీంతో దేశంలోని మూడింట రెండొంతులు సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ నమోదైంది. దీంతో నీటిశుద్ధి కార్యక్రమాన్ని ఇజ్రాయిల్‌ వేగవంతం చేసింది. భారీ ఎత్తున సముద్రపు నీటిని శుద్ధిచేయడం ప్రారంభించింది. దేశ ప్రణాళికలో పేర్కొన్న దానికంటే వేగంగా దీనిని చేపట్టింది. దేశంలోని ఐదు నీటి శుద్ధి కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియ చేపట్టింది.
ప్రస్తుతం ఈ దేశంలోని టెల్‌అవీవ్‌ వద్ద ఉన్న డీశాలినేషన్‌ ప్లాంట్‌ ప్రపంచంలోనే అతి పెద్దది. ఇది 2013 నుంచి పనిచేయడం ప్రారంభించింది. ఇక్కడి నుంచి రోజుకు 164 మిలియన్‌ గ్యాలన్ల తాగునీటిని అందజేస్తారు. ఈ ప్లాంట్‌ రివర్స్‌ ఓస్మోసిస్‌ పద్దతిలో పనిచేస్తుంది. నీటి నుంచి తొలగించిన ఉప్పును సురక్షిత పద్ధతిలో తిరిగి సముద్రంలోకి పంపిస్తారు.
పునర్వినియోగంలోనూ..
ఇజ్రాయిల్‌ సముద్రపు నీటిని శుద్ధి చేయడంతో పాటు మురుగునీటిని రీసైక్లింగ్‌ చేయడంపైన కూడా దృష్టిపెట్టింది. ప్రస్తుతం ప్రపంచవలో మరుగునీటిని శుద్ధి చేయడంలో ఇజ్రాయిల్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 86శాతం మురుగునీటిని రీసైక్లింగ్‌ చేస్తున్నట్లు ఓఈసీడీ నివేదిక పేర్కొంది. ఒకప్పుడు ఈ దేశంలో నీటి రీసైక్లింగ్‌ చేయని వారు 7.7 శాతం ఉంటే... ఇప్పుడది 2.2 శాతానికి తగ్గింది. వాటర్‌ రీసైక్లింగ్‌పై ప్రజల్లో పెరిగిన అవగాహనకు ఇది నిదర్శనంగా చెప్పొచ్చు.
వినియోగంలో కోత..
నీటిని అత్యధికంగా ఉపయోగించేది వ్యవసాయ రంగమే. ఈ విషయం ఇజ్రాయిల్‌కు బాగా తెలుసు.. అందుకే వ్యవసాయ రంగానికి వినియోగించే నీటిని గణనీయంగా తగ్గించింది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారీ ఎత్తున ప్రచారం చేసింది. డ్రిప్‌ ఇరిగేషన్‌ను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకొచ్చింది. దాదాపు 400 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మురుగునీటిని కూడా వ్యవసాయానికి వాడుకుంటోంది.
నీటి వినియోగంపై ప్రజల్లో నిర్వహించిన భారీ ప్రచారం మంచి ఫలితాన్నిచ్చింది. పట్టణ ప్రాంతాల్లో, గృహాల్లో నీటి వినియోగంలో దాదాపు 18 శాతం ఆదా చేస్తోంది. దీంతో పాటు ప్రజలకు పంపిణీ చేసే నీటి సరఫరాలో సబ్సిడీలను తొలగించింది. దీంతో ప్రజలు నీటి వినియోగాన్ని తగ్గించుకున్నారు. దీనికి తోడు పైపులైన్ల లీకులను అరికట్టడంతో మరో 9 శాతం నీరు ఆదా అయింది.
ఇళ్లలో వినియోగించే షవర్‌ హెడ్స్‌లో మార్పులు చేయడం.. పంపుల నుంచి వెలువడే నీటిధారను తగ్గించడం.. దీనికి తోడు ఇంట్లో ఉపయోగించుకునే పంపులు వంటి వాటిలో గాలి ఒత్తిడిని గణనీయంగా పెంచారు.. ఫలితంగా ఎక్కువ ధార వస్తున్న భావన కలగడంతో పాటు మూడో వంతు నీటిని ఆదా చేయగలిగారు.
ఫలితంగా ఇజ్రాయిల్‌ నేడు సొంతంగా దాదాపు 2 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. వీటితో పాటు చుట్టుపక్కల దేశాలకు దాదాపు 57 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని అందజేస్తోంది. ఫిబ్రవరిలో జోర్డాన్‌, పాలస్తీనాలకు సముద్రపు నీటిని శుద్ధిచేసి 120 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
దూరదృష్టితో రూపొందించిన చక్కటి ప్రణాళిక.. చిత్తశుద్ధితో కృషి చేసే నాయకులు.. సందర్భాలకు తగినట్లు స్పందించే ప్రభుత్వాలు.. క్రమశిక్షణతో సహకరించే ప్రజలు ఉంటే ఎంతటి కరవునైనా అవలీలగా ఎదుర్కొవచ్చని ఇజ్రాయిల్‌ విజయగాథ మనకు తెలియజేస్తోంది.

Source: Eenadu News

18-Mar-2016
------------------


16-Mar-2016
-------------------


15-Mar-2016
-------------------

08-Mar-2016
-------------------
Happy Women's Day.

07-Mar-2016
--------------------

02-Mar-2016
------------------